Sri Bhagavadgeetha Madanam-1    Chapters   

3. భాగవతములో భగవంతుడు

రెండు ప్రశ్నలు:

ఏ భక్తుడైనను తొట్టతొలుత ఎదుర్కోనవలసిన రెండు ప్రశ్నలు త్యాగరాజు తనకు తాను ప్రశ్నించుకొనెను.

1) ఎవరిని నిర్ణయించేదిరా?

2) నిన్నెట్లారాధించేదిరా?

అట్లే ఋగ్వేదమున కూడ ''కస్త్మె దేవాయ హవిషా విధేమ'' ఏ దేవునికి హవిర్భాగముల లర్పింపవలెను? అని ప్రశ్నింపబడినది. మొదటి ప్రశ్నకు సమాధానముగా భగవంతుడు శివుడా? మాధవుడా? కమల సంభవుడా? సగుణుడా? నిర్గుణుడా? అవతారపురుషుడా? విగ్రహ మూర్తియా? అని త్యాగరాజు వితర్కించుకొని తుదకు ''ఉండేది రాము డొకడే ఊరక చెడిపోకే మనసా'' అవి నిర్ణించు కొనెను. కాని శ్రీరాముడు ఉన్నచో అగుపించుట లేదే? ''మరుగేలరా ఓరాఘవా?'' అని తరువాత ప్రశ్నించెను. తుదకు ఆత్మానాత్మ విచారముచేత ''అన్ని నీ వనుచు అంతరంగమున తిన్నగాను వెదకి తెలిసికొంటిని'' అని సర్వము భగవన్మయముగా తిలకించెను. ''వాసు దేవస్సర్వమితి సమహాత్మా సుదుర్లభః'' అను భగవద్గీతావాక్యము ననుసరించి సర్వము భగవన్మయముగా నెఱిగిన త్యాగరాజువంటి మహాత్ములు దుర్లభులు. ''ఇందు గల డందు లేడను'' సందేహములేని ప్రహ్లాదుని వంటి భక్తులు అరుదు. ఏ నామముతో బిలిచినను భగవంతు డొక్కడే. ''ఏకంసత్‌విప్రా బహుధా వదంతి'' అని ఋగ్వేదము తెలుపుచున్నది. భగవంతుడు సగుణుడైనచో అతనికి నామరూపక్రియలు గలవు. భగవంతునకు మనుష్యరూపములు జంతువుల రూపములు కూడ చెప్పబడినవి. ఆతని క్రియలే లీలలు.

పరతత్త్వము

సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము

అవతారము విగ్రహము

దైవ మెవరని నిర్ణియించవలెను:

వైష్ణవులు విష్ణువు గొప్పవాడనీ, శైవులు శివు డాదిదై వమనీ. శాక్తేయులు శక్తియే పరతత్త్వమనీ అనుచున్నారు. విష్ణు పురాణములలో విష్ణువు మిన్నగా వర్ణింపబడెను. ''హరి సర్వోత్తమః'' విష్ణుమాయను శివుడు గెలువజాలడయ్యెను

అట్లే శివపురాణములలో శివుడే ఆదిదేవుడు. బ్రహ్మ విష్ణువులిద్దరు లింగాకారమున నున్న శివుని ఆద్యంతముల తెలిసికొనజాలరైరి. శివుడే విష్ణువునకు సుదర్శనాయుధము నొసగెను.

ఇక శక్తి పురాణములో శక్తియే పరతత్త్వము. శ్రీ లలితా సహస్ర నామములలో ''కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః అని చెప్పబడినది. అనగా శ్రీదేవి నఖములనుండి నారాయణ దశవతారము లుద్భవించెనని అర్థము.

పై విధముగనే గణపతి ఉపనిషత్తులయందు కూడ శ్రీ మహా గణపతియే పరబ్రహ్మముగా స్తుతింపబడెను. వినాయకుడే ''విశ్వోత్పత్తి. విపత్తి, సంస్థితి కరుడు.'' ''ప్రకృతేః పురుషా త్పరమ్‌'' ప్రకృతి పురుషులకు పరమైనవాడు. ''ఆవిర్భూతంచ సృష్ట్యాద్యౌ'' సృష్టికి ముందుగనే పుట్టెను అని చెప్పబడినది. ఒకప్పుడు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమలో ఎవరు గొప్పఅని వాదించుకొనిరి. తమ తగువును దీర్చువారు కలరేమో నని మూడులోకముల వెదకిరి. వారి కెవ్వరును కనిపించలేదు. తరువాత వారు ధ్యాన మగ్నులారి. వారి హృదయముల యందు విఘ్నేశ్వరుడు సాక్షాత్కరకించి, తానే సర్వమునకు కారణముని తెలిపి, సృష్టి, స్థితి, లయముల నాచరింపుడని ఆ త్రిమూర్తిల నాజ్ఞాపించెను. భగవంతుడైన గణపతి వాక్యమును లెక్క సేయక సృష్టి. స్థితి, లయములను స్వయముగా జరిపెనట. ఈ కథ గణశ పూర్వతాపిని ఉపనిషత్తున చెప్పబడినది. గణపతియే పరతత్త్వమని దీని అభిప్రాయము కదా! అందులకే ఆ ఉపనిషత్తు ''బ్రహ్మవిష్ణ్వాది గణానాం ఈశభూతః గణశః'' అని గణపతిని పొగడు చున్నది.

శ్రీ నరసింహ తాపిని ఉపనిషత్తును పరిశీలించిన అందుచెప్పబడిన దైవము శ్రీనృసింహాకార పరబ్రహ్మమే. నారసింహ సుదర్శన చక్రమున బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నృసింహదేవుని పరిచారకులుగా చూపబడిరి. ఈ సుదర్శన చక్రమే శ్రీ చక్రమునకు సమాన మని Sir John Woodroff తెలిపియున్నారు.

ఋగ్వేదమున ఇంద్రుడే పరతత్త్వముగా చెప్పబడెను. శ్రీవాశిష్ఠగణపతిముని ఇంద్రుని గూర్చి సహస్రనామమును వేదము నుండి గ్రహించి రచించెను.

''వ్రతానా ముత్తమం వ్రతమ్‌.'' అని ప్రతివ్రతమునను చెప్పబడినది. అనగా ఆయా వ్రతములయందు చెప్పబడిన దేవతకు పరమోత్కృష్ఠత ఆపాదింపబడినదని భావము.

పై విధముగ వేదములను ఉపనిషత్తులను, కావ్య ఇతిహాస పురాణములను పరిశీలించిన ప్రతిదాని యందు నిర్దేశింపబడిన దైవము ఏ పేరుతో పిలువబడినను. అతడే త్రిగుణాతీతుడైన పరబ్రహ్మవస్తువుగా భావింపబడెననుట నిర్వివాదాశంము. అతడే ప్రణవ స్వరూపుడు ప్రణవములోని అకారము బ్రహ్మ; ఉకారము విష్ణువు; మకారము శివుడు; అర్ధమాత్ర త్రిగుణాతీతుడైన పరబ్రహ్మము. అతడే ఆదినారాయణుడు, పరాశక్తి, పరమేశ్వరుడు. ఆ భగవంతునకే ఆనేక రూప నామములు కలవని భాగవతము తెల్పుచున్నది.

శ్లో|| #9; బహూని సన్తి నామాని రూపాణిచ సుతస్యతే

గుణకర్మానురూపాణి తాన్యాహం వేద నోజనాః ||

సంస్కృత -భాగవతము 10-8-15

నందుని పుత్రుడగు శ్రీకృష్ణునకు అనేక నామమలు రూపములు కలవు. అతని గుణములను బట్టి, కర్మలనుబట్టి నామములు ఏర్పడుచున్నవి. ఈ నామములు నే నెరుగుదును సామాన్యజను లెరుగరని గర్గాచుర్యులు తెలిపిరి. భగవంతుడు నిర్గుణుడు, నిరాకారు డని భాగవతము తెల్పుచున్నది.

తే|| అరసి నిర్గుణ బ్రహ్మంబు నాశ్రయించి

విధి నిషేధ నివృత్తి సద్విమలమతులు

చేయుచుందురు హరిగుణ చింతనములు

మానసంబుల నే ప్రొద్దు మానవేంద్ర||

-భాగవతము 2-6

శ్లో|| పరినిష్ఠితోపి నైర్గుణ్య ఉత్తమశ్లోక లీలయా

గృహీత చేతా రాజర్షే ఆఖ్యానం యదధీతవాన్‌ 2-1-9

భగవంతుడు సాక్షి మాత్రమే. అతడు మనస్సునకు వాక్కు నకు అందనివాడు.

శ్లో|| నమ ఆత్మ ప్రదీపాయ సాక్షిణ పరమాత్మనే

నమో గిరాం విధూరాయ మనసశ్చేతసా మపి 8-3-10

అతడు సత్తుకాదు. అసత్తుకాదు.

శ్లో|| శశ్వత్ప్రశాంత మభయం ప్రతిబోధ మాత్రం

శుద్ధం సమం సదసతః పరమాత్మ తత్త్వం

శబ్దో నయత్ర పురుకారకవాన్‌ క్రియార్థో

మాయా పరైత్యభిముఖేచ విలజ్జమానా 2-7-47

సృష్టికి ముందుగా బ్రహ్మము మాత్రమే యుండెను. అతడు మాయగను జీవుడుగను విడిపోయెను. దృక్‌ దృశ్యము లేర్పడెను. దృశ్యము ప్రకృతి, చూచువాడు పురుషుడు.

శ్లో|| తన్మాయా ఫలరూపేణ కేవలం నిర్వికల్పితమ్‌

వాఙ్మనో7గోచరం సత్యం ద్విధా సమభవత్‌ బృహత్‌

11-24-3

శ్లో|| తయో రేకతరోహ్యర్ధః ప్రకృతిః సోభయాత్మికా

జ్ఞానం త్వన్యతమో భావః పురుషః సో7భిధీయతే

11-24-4

ఆదినారాయణు డెవరు ?

భాగవతక దైవమైన ఆదినారాయణు డెవరో పరిశీలింతము. ద్వితీయ స్కంధమున బ్రహ్మ ఈవిధముగా తెలిపెను.

చ|| అతని నియుక్తి చెంది సచరాచర భూత సమేత సృష్టినే వితతముగా సృజింతు. ప్రభవిష్ణుడు విష్ణుడు ప్రోచు. పార్వతీ పతి లయమందజేయు, హరి, పంకరహోదరు. డాదిమూర్తి, అచ్యుతుడు త్రిశక్తి యుక్తు డగుచుండును నింతకు దాను మూలమై.

భాగవతము 2-101

సరస్వతి, లక్ష్మి, పార్వతి అనబడు త్రిశక్తులతో కూడిన ఆది నారాయణుడే భాగవతదైవము. అతడే సర్వమునకు మూలము. అతని శక్తివలననే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయములను జచరుపుచున్నారని పై పద్యభావము.

నారాయణుడు త్రిమూర్త్యాత్మకుడే గాక త్రిమూర్తుల రూపముల ధరించెననికూడ బాలకృష్ణుని లీలలు తెలుపుచున్నవి.

ము|| చెయివుల్‌ సేయుతరిస్‌ విధాత కరణిన్‌చెన్నొందు; సంతోషదృష్టియుంతుడై నగుచన్‌ జనార్దనుని మాడ్కిన్‌ బొల్చు; రోషించియున్నయెడన్‌ రుద్రుని భంగి నొప్పును; సుఖానందంబునన్‌ బొంది తన్మయుడై బ్రహ్మము భాతి బాలు డమరున్‌.

భాగవతము10-195

అనగా బాలకృష్ణుడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, పరబ్రహ్మల రూపముల నగుపించెను. ఇట్టి త్రిమూర్త్యాత్మక స్వరూపమునే పోతన బాల గోపాల బ్రహ్మముగా భావించె ననుటకు సందేహములేదు.

గోపికా వస్త్రాపహరణ కాలమున బాలకృష్ణుని సత్వరజస్త మోగుణాతద్మ లీలలను తామెఱిగినట్లు గోపికలు చెప్పిరి. ఆదినారాయణు డీ గుణముల వలననే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరరూపముల బొందెను.

సీ|| రాజసంబున నీవు రంజిల్లు టెరుగమే

చెలరేగి వింతలు సేయుచుండ,

సత్వసంపద గల్గి జరుగుట దలపమే

సిరిగల్గి యన్యుల జెనుకుచుండ

గురుతర శక్తి యుక్తుడ వౌట ఎఱుగమే

తామసంబున నెగ్గు దలచుచుండ

ఒక భంగితో నుండకుంట జింతంపమే

మాయావియై మారు మలయుచుండ

నేమి జాడవాడ, వేపాటి గలవాడ,

వే గుణంబు నెఱుగ, వెల్ల ఎడల

నొదిగియుండ నేర వోరత పొద్దును.

పటము లీగదయ్య! పద్మనయన! భాగవతము 10-822

ఇట్టి రెండర్థముల సూచించు పద్యములు భాగవతమున అనేకములు కలవు.

సుగుణరూప భగవంతుని త్రికరణములు:

మానవు డొక పని చేయవలసినప్పుడు త్రికరణ శుద్ధిగా చేయవలయును. త్రికరణము లనగా మనోవాక్కాయములు. మనస్సుతో ఆలోచించి నోటితో చెప్పి కాయముతో ఆ కార్యము చేయవలయును. ఆదినారాయణుడు లక్ష్మీదేవి విష్ణువు యొక్క (హృదయమున) మనస్సునందు కలదు. త్రిమూర్తుల రూపముల దాల్చి త్రిశక్తుల సహాయమున సృష్టి, స్థితి, లయములను చేయచున్నాడు కదా? ఈ శక్తుల స్థానములనుపరికింపుడు. సరస్వతి బ్రహ్మయొక్క వాక్కు నందు కలదు. పార్వతి శివునియొక్క సగముదేహమున కలదు. వీరే ఇచ్ఛా జ్ఞాన, క్రియాశక్తులు, వీరే ఆదినారాయణుని వాక్కు, మనస్సు, కాయములని చెప్పవలయును. అనగా ఆదినారాయ

ణుని మనోవాక్కాయములైన త్రికరణములే లక్ష్మీ సరస్వతీ పార్వతులని భావము. కావున భగవంతుడుచేయు సృష్టి స్థితి లయములకువీరు సహకరించుచున్నారు. ఈ భావన ఎంతటి చక్కని సంకేత స్వరూపమో గమనింపుడు.

శ్రీ నృసింహతాపిని ఉవనిషత్తునందు, శ్రీ నృసింహాకారా పరబ్రహ్మమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులేకాక, లక్ష్మీ సరస్వతీ పార్వతులని కూడ చెప్పబడినది.

యోహవై నృసింహోదేవో భగవాన్‌ యశ్చబ్రహ్మాతసై#్మవై నమో నమః

" యశ్చవిష్ణుః "

" యశ్చమహేశ్వరః "

" యా సరస్వతీ "

" యా శ్రీః "

" యా గౌరీ "

" యశ్చ సర్వం "

తనూమంత్రములు - శ్రీ నృసింహ పూర్వతాపి న్యుపనిషత్తు

నారాయణ శబ్దార్థము:

భాగవ తము పంచమవేదము. శ్రుతి స్మృతి పురాణముల కేక వాక్యత కలదు. భాగవత నిర్వచనములో గాయత్రిని గూర్చి వివరించునప్పుడు, వేదమాతయైన గాయిత్రి భాగవత దైవమైన ఆదినారాయణుడు ఒకే పరతత్త్వమని ముందుగా నిరూపించితిని. ఇక నారాయణ శబ్దార్థము ను కూడ పరిశీలింతము.

శ్లో|| ఆపో నార ఇతి ప్రోక్తా అపోవై నర సూనవః

తా య దస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృతః

అని భాగవతమున నారాయణ శబ్దము నిర్వచింపబడియున్నది.

సీ|| #9; నళినాక్ష! నీ వాది నారాయణుండవు

జలము నారము జీవ చయము నార

ముందు నీవుంట నీయందవి యుంటను

నారాయణుండను నామమయ్యె.

-భాగవతము దశమ స్కంధము 559

నారమనగా జలము. ఈ జలశబ్దమును అపశ్సబ్దముతో పోల్చి శ్రీ సూక్తార్థ సంగ్రహమునందు ఇట్లు వివరింపబడినది.

''యదగ్రే ఆప ఏవాస అద్భ్యః సర్వ మభూ ఙ్జగత్‌

నారస్తా అయనం యస్య సహి నారాయణః పరః

సూతే నారాంశ్చ యా ఆప స్తాయ దస్యాయనం హరేః

తస్య స్వాభావికో శక్తి ర్దేవీ నారాయణీ స్మృతా

అద్బ్యోహి పృథివీజాతా అగ్ని రభ్యభవత్తదా

వాయు రర్కో హ్యపాం వత్స శ్చంద్రమా స్సర్వ మప్యధా

జీవం జీవరసం దివ్య మమృతం జల ముచ్యతే

జాయతే లీయతే యత్ర జగత్త జ్జల మీరితం

తజ్జలాని చ శాంతాత్మా చిరం జలముపాసతే

తస్మా త్సర్వ ని దానానా మపాం సష్టృత్వ ముచ్యతే.

-సూక్తార్థ సంగ్రహము

''తజ్జలానితి శాంత ఉపాసీత" -ఛాందోగ్యము

''ఆపోవా ఇదగ్‌ం సర్వం విశ్వాభూతా న్యాపః -యజుర్వేదము

''యోపా మాయతనం వేద ఆయతనవాన్‌ భవతి"

-యజుర్వేదము

పై నిదర్శనములను బట్టి ఇక్కడ జల శబ్దముచే సూచింపబడినది బ్రహ్మవస్తువేకాని పంచభూతముల యందలి నీరు కాదు. ఈ జలమునుండియే పంచభూతములు జవించినవి. నారాయణుడే జలము. నారాయణుని నుండి ''జ'' సర్వము పుట్టినది. నారాయణుని యందు ''ల'' సర్వము లయము జెందుచున్నది. ఛాందోగ్యమున జల శబ్దమునకు తజ్జ, తదన్‌, తల్ల అని వ్యాఖ్యానము చేయబడి సృష్టి స్థితి లయములను చేయునదిగా చెప్పబడినది. నారాయణుడే వీటికి స్థానమైన వాడని చెప్పుటచేత సృష్టి స్థితి లయములకు మూలమైన ఆది దేవుడని చెప్పక తప్పదు. శ్రీ సూక్తములో నారాయణి యగు శ్రీ దేవి ''ఆపః'' శబ్దముచే ఆప్‌ స్వరూపిణిగా ప్రార్థింపబడినది.

శ్రీ నృసింహా తాపిని ఉపనిషత్తులోభూమి ''ససాగరాం సపర్వతాం సప్తద్వీపం వసుంధరాం'' అను విశేషణములచే వర్ణింపబడినది. వ్యాఖ్యానము వ్రాయుచు శంకరుడు సాగరశబ్ద విశేషణమే ప్రథమమున ఉండుటకు కారమణమేమని ప్రశ్నించుకొని పై ఉపనిషత్తు నారాయణ పరమగుటచేత సాగర శబ్దముతో ఆరంభించుటయే ఔచిత్యమని నిరూపించెను. అట్లే తాను రచించిన లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రములో మొదటి శ్లోకారంభమున ''శ్రీమత్పయోనిధి నికేతన'' అని క్షీరసాగర శబ్దముతో ప్రారంభించుట ఎంత సమంజసముగా నున్నదో పరికింపుడు.

భాగవతమున నారాయణుని గూర్చిని మిగిలిన బ్రహ్మవాక్యములను గమనింపుడు

సీ|| సకల భూతములకు సాక్షి. వధీశుడ

వబ్ధి నిద్రించు నారాయణుండ

నీ మూర్తి ఇదినీకు నిజమూర్తి యనరాదు

నళిన నాళము త్రోవ నడచిమున్ను

తే|| కడగి నూఱండ్లు వెదకి నే గాననైతి

నేక దేశస్థుడవు గా వనేక రుచివి,

జగము లోనుందు, నీతోన జగములుండు

నరుదు నీమాయ నెట్లైన నగుచునుండు.

భాగవతము 10 పూర్వభాగము 559

భగవంతుడు పురుషుడా లేక స్త్రీయా?

కొందరు భగవంతుడు స్త్రీ యా ? పురుషుడా ? యని ప్రశ్నింతురు. పరదేవతయైన శ్రీదేవి దేవీగీతలో ''నైవస్త్రీ న పుమానేవ నైవచాయం నపుంసకః'' నేను స్త్రీని గాదు. పురుషుడను గాదు, నపుంసకుడను గాదు. ఏరూపమున భక్తుడు ప్రార్థించిన ఆరూపమున దర్శన మిత్తునని చెప్పుకొన్నది.

శ్లో|| స్త్రీ రూపాం చింతయే ద్దేవీం

పుం రూపాం వా విచింతయేత్‌

అధవా నిష్కలాం ధ్యాయేత్‌

సచ్చిదానంద లక్షణమ్‌. సౌభాగ్య భాస్కరము

ఉ|| కొందరు నిన్ను తల్లిగను. కొందరు పాలనసేయు తండ్రిగా.

కొంద రుపాధిహీననుగ గొల్తురు నిర్గుణ భావమెంచి; నీ

వందర కన్నిరూపముల నంతట దోతువు భక్త కోటికిన్‌;

వందలు వేలు భక్తుల యుపాసన రూపములమ్మ శ్రీసతీ!

-శ్రీసతీ శతకము

భగవంతునకు లింగభేదము లేదు.

శివకేశవ అభేద దృష్టి :

''ఏకోదేవః కేశవోవా శివోవా'' కేశవుడో శివుడో దేవు డొక్కడే. తిక్కన ''విష్ణురూపాయ నమశ్శివాయ'' అని హరిహరనాధుని స్తుతించినట్లు పోతన శివకేశవులకు భేదము లేదని పెక్కుచోట్ల సమర్థించెను.

గీ|| చేతులారంగ శివుని పూజింపడేని

నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని

దయయు సత్యంబు లోనుగా దలపడేని

కలుగనేటికి తల్లుల కడుపు జెరుప ? భాగవతము 1-14

పోతన బాలకృష్ణుని వర్ణించు పద్యములందు శివ కేశవ అభేదమును చక్కగా వివరించెను.

సీ|| తనువునంటిన ధరణీ పరాగంబు

పూసిన నెఱిభూతి పూతగాగ

ముందర వెలుగొందు ముక్తాలలామంబు

తొగల సంగడికాని తునుకగాగ

ఫాల భాగంబుపై పరగు కావిరిబొట్టు

కాముని గొలిచిన కన్నుగాగ

కంఠమాలిక లోని ఘన నీల రత్నంబు

కమనీయమగు మెడకప్పుగాగ

హారవల్లు లురగ హారవల్లులు గాగ

బాల లీల ప్రౌడ బాలకుండు

శివుని పగిది నొప్పె, శివునకు దనకును

వేరులేమి దెల్ప వెలయునట్లు.

భాగవతము 10-297

పై పద్యమునందు బాలకృష్ణునిలో శివుని దర్శించి పోతన శివకేశవులకు భేదము లేనట్లు రూప సామ్యమును జూపెను.

భగీరథుడు ఆకాశగంగ భూలోకమునకు దిగునప్పుడు దాని వేగమును భరింపగలవాడు శివుడొక్కడేయని, విశ్వభావనుడైన శివుని యందు సర్వజగంబులు గలవని నుతించెను.

మ|| తనలో నన్ని జగంబులున్‌ గలుగుటన్‌ తానన్నిటన్‌ గల్గుటన్‌

జననీ తంతువులందు జీరగల యా చందంబునన్‌ విశ్వభా

వనుడై యొప్పు శివుండుగాక మరి నీవారిన్‌ నివారింప నే

ర్చిన వాడెవ్వడు? నిన్‌ ధరించుకొరకై శ్రీకంఠునిన్‌ గొల్చెదన్‌

భాగవతము 9-227

ఈ పద్యములో మొదటిపాదము ''తత్‌సృష్ట్వాతదేవ అనుప్రావిశతు'' అను వేదవచనమును సూచించుచున్నది. శ్రీకృష్ణుడు కూడ బాల్యచేష్టలలో మన్ను తిన్నప్పుడు నోరు తెరువమని యశోద కోరగనోటిని తెరచి అందులో విశ్వమునంతయు జూపెను.

''యచ్చకించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా

అంతర్బహిశ్చ తత్సర్వం వాప్య నారాయణ స్థితః''

జగత్తున బాహ్యాభ్యంతరముల యందు నారాయణడే కలడని మంత్రపుష్పము తెలుపుచున్నది.

''శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే

శివశ్చహృదయం విష్ణుః విష్ణోశ్చహృదయం శివః

యధా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయ శ్శివః

యధాంతరం నపశ్యామి తధామే స్వస్తి రాయుషీ"

శివకేశవులకు భేదములేదు. శివుడు విష్ణుమయుడు. విష్ణువు శివమయుడు. ఎవరికి వీరియందు భేదబుద్ధిలేదో అట్టివారికి క్షేమము కలుగును.

''నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మేపాహి'' అని నమకమున అంత్యమున కలదు చమకమున రుద్రుడే వైద్యుడు, మన్యువు, ఆటవికుడు. వధించువాడు, కులాలుడు, అశ్వపతి మొదలగు సర్వమయుడని చెప్పబడినది. అనగా రుద్రుడు సర్వాంతర్యామి సర్వవ్యాపియనుట. ''వాసితం తే జగత్రయమ్‌'' అనబడు వాసుదేవుడు కూడ త్రిజగద్వ్యాపియే కాన శివకేశవులకు భేదములేదు. ''ఉండేది రాముడొకడే'' అన్న త్యాగరాజు కూడ ''శివ శివ శివ యనరాదా'' అని ప్రభోధించెను.

శివదూషణము సేయుట పాప మని భాగవతము హెచచ్చురించుచున్నది.

ఎ) మొదటి హెచ్చరిక దక్షయజ్ఞమున కలదు. అందులో శివ కేశవ భేదము పాటింవరాదని, అభేదభక్తి సూచింపబడినది. దక్షుడు తన అల్లుడైన ఈశ్వరు నాహ్వానింపక యజ్ఞమును చేయ బూనెను యజ్ఞమును తిలకింప వచ్చిన పార్వతిని (సతీదేవిని) దక్షుడు అవమానించుటచేత ఆమె దుఃఖితయై తపోఅగ్నిలో తన దేహమును కాల్చివేసి ఆత్మాహుతి చేసికొనెను. ఈశ్వరుడు కోపించి దక్షయజ్ఞమును నాశనము జేయుమని వీరభద్రుని పంపెను. వీరభద్రుడు దక్షయజ్ఞమును నాశనముజేసి దక్షుని చంపెను. తరువాత ఈశ్వరుడు దేవతల కోర్కెపై కరుణించి దక్షుని బ్రతికించెను. అప్పుడు త్రిమూర్తులు దక్షుని యెదుట ప్రత్యక్షమైరి. ఈ సందర్భమున శ్రీ మహావిష్ణువుతో దక్షుడు పలికిన వచనములలో తాను శివకేశవ భేదము పాటించి ఎట్లు శిక్షింపబడెనో తెల్పుకొని తనకు అభేద భక్తిని ప్రసాదింపు మని కోరెను.

''నీవ ఈశ్వరుండ వనియు, నితరులైన బ్రహ్మరుద్రాదులు భవన్మాయా విభూతు లగుటచేసి లోకంబులకు ఈశ్వరులు కారనియు భేదదృష్టిగల నన్ను రక్షింపుము. ఈ విశ్వాకారుడైన ఫాలలోచనుడు చరాచర జంతువులు నీవ. భవ ద్వ్యతిరిక్తంబు జగంబునలేదు'' కావున అభేదదృష్టిగల ఏకేశ్వరోపాసన భాగవతమున సూచింపబడినది. పై దక్షుని వచనములు నారాయణుడే ''స బ్రహ్మ సశివః సహరిః సేద్రః సోక్షరః పరమస్వరాట్‌'' అను మంత్ర పుష్ప వాక్యముతో పోల్చిచూడుడు.

బి) రెండవ హెచ్చరిక చిత్రకేతూపాఖ్యానమున చెప్పబడినది. చిత్రకేతుడు శాపగ్రస్తుడగుటకు కారణము శివదూషణమేనని ముందు వృత్రాసురవధ యందు నిరూపింతును.

నిర్గుణ పరబ్రహ్మము సగుణుడై ఏల అవతరించెను :

చ|| జననము లేక, కర్మముల జాడలబోక, సమస్తచిత్త వ

ర్తనుడగు చక్రికిం గవు లుదారపదంబుల జన్మకర్మముల్‌

వినుతులు సేయుచుండుదురు; వేద రహస్యమునందు నెందుజూ

చిన మరి లేవు జీవునకు చెప్పిన కై వడి జన్మకర్మముల్‌.

భాగవతము 7-68

అని భాగవతములో జీవునికివలె భగవంతునకు జన్మకర్మములు లేవని తెలిపినప్పటికిని భగవంతు డెందుల కవతరించెనని ప్రశ్న రాకమానదు.

అవతరణ మనగా దిగివచ్చుట. భాగవతములో శ్రీకృష్ణుడు తన జన్మకర్మములు దివ్యములని తెలిపెను.

శ్లో|| అవజానంతి మాం మూఢాం

మానుషీం తను మాశ్రితం

పరంభావ మజానంతో

మమ భూత మహేశ్వరః భగవద్గీత 9-11

శ్రీకష్ణుని లీలామానుష విగ్రహునిగాని పరాత్పరునిగను మానవులు గుర్తించు ట లేదు.

జీవేశ్వరుల భేదమును భాగవతము చక్కగా వివరించినది. ''జీవుడవిద్యా మహిమం జేసి కర్మానుగతంబైన మిథ్యారూప దేహ సంబంధుండు. భగవంతుడు నిజ యోగమాయా మహిమంబునంజేసి స్వేచ్ఛా పరికల్పిత చిద్ఘన లీలా విగ్రహుండు. కావున భగవంతుడైన ఈశ్వరుండు స్వభజనంబు ముక్తిసాధన జ్ఞానార్థంబు కల్పితంబని'' భగవంతుడు బ్రహ్మతో తెలిపెను.

భాగవతము 2-224

భగవద్గీతలో కూడ శ్రీకృష్ణు డిట్లు తెలిపెను.

శ్లో|| అజోపి స న్నవ్యయాత్మా భూతానా మీశ్వరోపి సన్‌

ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవా మాత్మ మాయయా.

భగవద్గీత 4-6

నేను పుట్టుక లేనివాడను, నాశనము లేనివాడను, సమస్త ప్రాణికోటికి అధికారిని. నా ప్రకృతిని వశపరచుకొని మాయచేత నేను పుట్టుచున్నాను.

శ్లో|| అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మా మబుద్ధయః

పరంభావ మజానంతో మా మవ్యయ మనుత్తమమ్‌||

భగవద్గీత 7-24

వ్యక్తముగాని నన్ను బుద్ధిహీనులు వ్యక్తునిగా నెంచుచున్నారు. నా సర్వోత్కర్షమును ఎఱుగనివారు నాకు నాశము గలదని భావించుచున్నారు.

అయినచో భగవంతు డెందు కవతరించెను ? ధర్మ సంహిత యనబడు భారతమునగల భగవద్గీతయందు భగవంతుడు ధర్మమునకు హాని సంభనించినప్పుడు అవతరించెదనని చెప్పుకొనెను.

శ్లో|| యదా యదాహి ధర్మస్యగ్లాని ర్భవతి భారతః

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజా మ్యహమ్‌

భగవద్గీత 4-7

భక్తునకు శ్రవణ చింతన వంద నార్చనముల నొసగుటకు భగవంతు డవతరించె నని భాగవతము తెలుపుచున్నది.

é గీ|| మరచి అజ్ఞాన కామ్య కర్మముల దిరుగు

వేదనాతురులకు తన్నివృత్తి జేయ

శ్రవణ చింతన వంద నార్చనముల లిచ్చు

కొఱకు నుదయించితండ్రు నిన్‌ కొంద రభవ!

భాగవతము 1-196

పై పద్యములో అభవ (=పుట్టుకలేనివాడా) అని సంబోధించి భగవంతు డవతరించె ననుట గమనింపదగినది.

ఇష్టదైవము, గృహదైవము :

జ్ఞానులు ఆధ్యాత్మికతత్త్వము గలవారై నిర్గుణ పరబ్రహ్మమును ధ్యానింతురు. ఇతరులు కొందరు ఆధిదైవిక చింతనగలవారై భగవంతుని విభూతులుగల రూపములను ధ్యానింతురు కొందరు భగవంతుని మానవాకృతిని గొన్నవానిగా భావించి అధిభౌతిక దృష్టిచేత అతని లీలలను మాహాత్మ్యమును వర్ణింప నిచ్చగింతురు. భగవంతుని లీలలు లేనిచో భగవంతుడు మనల రక్షించునని ఎట్లు భావించుటకు వీలగును? అతడు అనేక రూపములతో అవతరించి మానవులకు రక్షించెను. భాగవతము, కపిలుడు మొదలగు 24 అవతారములను వర్ణించినది. ఏ మూర్తిని ధ్యానించినను భగవంతు డొక్కడే అని గ్రహించిన చాలును.

హిందువులలో కొందరు వెంకటేశ్వరులను, కొందరు కనకదుర్గను కొందరు ఈశ్వరుని - ఇట్లు వేరు వేరు దేవతలను గృహదైవములుగా కొలుచు సంప్రదాయము కలదు. గృహదైవమునే కొలుచుట శ్రేయస్కరమని వేదము తెలుపుచున్నది.

''యావై స్వాం దేవతా మతి యజతే ప్రస్వాయై, దేవతాయై చ్యవతే, స పరాం ప్రాప్నోతి, పాపీయాన్‌ భవతి.''

- యజుర్వేద సంహిత

వారి వారి అభిరుచులను బట్టికూడ ఇష్టదైవమును ఎన్నుకొనుచుందురు. అప్పయదీక్షితులవంటి పండితుడుకూడ తనకు శివునియందె భక్తి కలుగుచున్నదని ఇట్లు తెలిపెను.

శ్లో|| మహేశ్వరేవా జగతా మధీశ్వరే జనార్దనేవా జగదంతకే పరే

న వస్తుభేద ప్రతిపత్తి రస్తుమే తథాపి భక్తి స్తురుణందు శేఖరే.

నాకు శివకేశవులయందు భేద దర్శనములేదు. కాని శివునియందే భక్తి కలుగుచున్నది.

యధాభిమత ధ్యానాత్‌ చిత్త స్థైర్యం భవతి -యోగసూత్రము

ఇష్టదైవమును ప్రార్థించుటవలన చిత్తస్థైర్య మేర్పడును.

é పోతనియం దభేదభక్తి మూర్తీభవించినది. ఇష్టదైవమని గాని గృహదైవమని గాని పేర్కొనలేదు. భాగవతమున పోతన తన వంశాభివర్ణనము సేయుచు తండ్రియగు కేసన శైవశాస్త్రమతము నవలంబించెననియు. తన తల్లియగు లక్కమాంబ ''సదాశివ పాదయు గార్చనాను కంపా నయ వాగ్భవాని'' యనియు, అన్నయగు తిప్పన ''ఈశ్వర సేవా కాము'' డనియు చెప్పికొనుటచేత అతని గృహదైవము ఈశ్వరు డనవచ్చును. కాని పోతన ''గంగ కుజని క్రుంకు లిడివెడలి'' ''మహేశ్వర ధ్యానంబు సేయుచున్న'' ఎడ అతనికి ''రాజశేఖరు'' డగు పించెను. ఇక్కడ చమత్కారమంతయు ''రాజశేఖర'' శబ్దప్రయోగమున నున్నది రాజు అనగా చంద్రు డని అర్థము. శేఖరు డనగా శిరము నందు గలవాడని అర్థము. రాజశేఖరు డనగా చంద్రుని శిరమున గలవాడగు ఈశ్వరుడని పాఠకులు భావింతురు. మహేశ్వర ధ్యానము సేయు పోతనకు ఈశ్వరు డగుపించుట సమంజసమే కదా? కాని కనుపించిన రాజశేఖరుడు తాను ''రామభద్రుండ'' ననియు తెలిపికొనెను.

ఇక్కడ రాజశేఖరు డనగా రాజులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు. ''మనుజేశ్వరాధములు'' గాక రాజాధిరాజు. భగవంతుడైన శ్రీరాముడే అతని కగుపించెను. కాని భగవతమున షష్ఠ్యంతములు శ్రీ కృష్ణపరముగా పోతన చెప్పెను. అనగా మహేశ్వరుని ధ్యానింపగా శ్రీరాముడగుపించుట శ్రీకృష్ణుని పరముగా షష్ఠ్యంతములు చెప్పుట ఎంతని అభేద భక్తిని సూచించునో గమనింపుడు.

పర అపర బ్రహ్మలు :

భాగవతమున లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడే పర బ్రహ్మమని చెప్పబడియున్నది.

శ్లో|| మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయః

బలిం హరంత్య వనతాః కిముతాన్యే నరాధిపాః ||

ఉగ్రసేను డిట్లనెను. ''నేను సేవకుడనై నీ సేవ చేయుదును. గొప్పగొప్ప దేవతలుకూడ తలలు వంచి నిన్ను సేవింతురు. ఇతర రాజులగూర్చి చెప్పనేల?

10-45-14

శ్లో|| దిష్ట్యా పుత్రాన్‌ పతీన్‌ దేహాన్‌ స్వజనాన్‌ భవనానిచ

హిత్వావృణీత యూయం యత్‌ కృష్ణాఖ్యం పురుషం పరమ్‌.

గోపికలు పుత్రులను, పతిని, దేహమును, స్వజనమును గృహమును వదలి పురుషోత్తముడును పరుడును అగు శ్రీకృష్ణుని పతిరూపమున వరించిరి. శ్రీకృష్ణుడే అందరకు పతి. 10-47-26

శో|| ఏతన్మే పురుషాధ్యక్ష ప్రపన్నాయచ కథ్యతామ్‌

త్వం బ్రహ్మ పరమం వ్యోమ పురుషః ప్రకృతేః పరః

అవతీర్ణోసి భగవన్‌ స్వేచ్ఛోపాత్త పృథగ్వపుః

11-11-26,27

ఓ బ్రహ్మాది పురుషులను నియమించువాడా! ఈ భక్తి రహస్యమును నిన్ను శరణుపొందిన నాకు చెప్పుము. నీవు పరబ్రహ్మము. పరమ వ్యోమము. హృదయాకాశము దహరాకాశ రూపుడవు లేక హృదయ వుండరీకమున వెలుగుదువు. లేక ఆకాశమువలె దేనినంటని అసంగుడవు. ప్రకృతికి పరుడైన పురుషుడ వగుదవు. నీ వారగు భక్తుల కోరికచే నిచ్చవచ్చిన ప్రత్యేకమైన పరిమితమైన శరీరముగల వాడవై భూమియం దవతరించి యున్నావు.

గుణమయులగు ఇతర దేవతలు సత్వ రజప్తమో గుణములను గలిగి యుందురు. బ్రహ్మ రజోగుణమును విష్ణువు, సత్వగుణమును, శివుడు తమోగుణమును కలవారు. ఈ గుణసంకలనము చేత అనేక దేవతలు కలిగిరి. కాని గుణాతీతమైన పరతత్త్వ మొక్కటియే అందువలన శంకరాచార్యులు గుణమయులగు దేవతలను అపరబ్రహ్మములనియు, గుణాతీతుడైన పరమేశ్వరుని పరబ్రహ్మమనియు తన వ్యాఖ్యానముల యందు పేర్కొనెను. పురాణముల యందు ఈ భేదమును పాటింపక ఒకే నామమును ఉపయోగించుటచేత అభిప్రాయ బేధము కలుగుచున్నది. ఉదాహరణకు గజేంద్రుని మొరను

''విశ్వమయత లేక వినియు నూరకయుండి రంబూజాసనాదు లడ్డపడక'' అనగా బ్రహ్మరుద్రాదులు విశ్వమయత లేక గజేంద్రుని కాపాడలేదని చెప్పబడినది. అనగా వీరు గుణప్రధామలైన త్రిమూర్తులకు చెందినవారు. ఆదినారాయణుడు త్రిగుణాతీతుడు సర్వాంతర్యామియైన వాసుదేవు డగుటచేత గజేంద్రుని రక్షించెను.

శ్రీ కృష్ణుడు గుణమయులగు దేవతల నర్చించు వారిని గురించి ఇట్లు తెలిపెను,

శ్లో|| యోయో యామ్యాం తనుంభక్తః శ్రద్ధ యార్చితు మిచ్ఛతి

తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదధా మ్యహం.

-భగవద్గీత 7-21

ఏ మూర్తియం దేవరికి శ్రద్ధ కలిగియుండునో (ఇష్టదైవము, గృహదైవము ) ఆ మూర్తియం దతనికి చలింపని శ్రద్ధనే కలుగ జేయుచున్నాను.

శ్లో|| సతయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధన మీహతే

లభ##తేచ తతఃకామాన్‌ మమైవ విహితాన్‌ హితాన్‌||

భగవద్గీత -7-22

అట్టి దేవతాభక్తుడు నాచే నొసగబడిన శ్రద్ధతో ఆ దేవతనే పూజింప గోరును. నేనా దేవతామూలమున వానికిష్టములైన కోర్కెల నిచ్చుచున్నాను. ఇతర దేవతల నారాధించినను ఫల మిచ్చువాడను నేనే కదా?

శ్లో|| అనంతవత్తు ఫలం తేషాం తద్భవ త్యల్పమేధసాం

దేవాన్‌ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మా మపి.

అల్ప బుద్ధిమంతులగు దేవతా ఉపాసకులు దేవతలనే చేరు చున్నారు. వారి ఫలము నశించునదేకాని శాశ్వతముక్తి కాదు. నా భక్తులు నన్నే చేరుదురు. మోక్షమును బొందుదురు. దేవతలను గొల్చువారు దేవతలను, సర్వాత్మభావముతో నన్ను గొల్చువారు నన్నును బొందుదురు.

శ్లో|| యోప్యన్య దేవతా భక్తా యజన్తే శ్రద్ధ యాన్వితాః

తేపి మామేవ కౌన్తేయ యజన్త్య విధి పూర్వకమ్‌.

భగవద్గీత 9-23

శ్రద్ధచే కూడిన భక్తులు అన్యదేవతలను బూజించినను, నన్ను బూజించిన వారగుదురు. కాని వారు చేసినపూజ విధిపూర్వకము కాదు. ఎందుకనగా నేను సర్వాంతర్యామి నని తెలియకజేసిన పూజ గావున.

శ్లో || అహంహి సర్వ యజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ

నతు మా మభిజానంతి తత్త్వే నాతశ్చ్య వన్తి తే.

భగవద్గీత 9-24

ఆయా దేవతారూపముగా సర్వయజ్ఞములను భుజించువాడు ఫలమిచ్చువాడు నేనే. ఇట్టి నన్ను యదార్థముగా దెలియరు. కాన పునరావృత్తిని పొందుచున్నారు.

శ్లో|| యాన్తి దేవవ్రతా దేవాన్‌ పితౄన్‌ యాన్తి పితృవ్రతాః

భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజనోపిమామ్‌.

భగవద్గీత 9-25

దేవతలను బూజించువారు దేవతలను బొందుదురు. పితృవులను బూజించువారు పితృదేవతలను బొందుచున్నారు. భూతములను బూజించువారు భూతములను బొందుదురు. నన్ను భజించువారు నన్నే బొందుదురు.

ఇట్లే భాగవతమున కూడ ఇతర దేవతల ప్రార్థించినను పరమాత్మను కొలిచినట్లే యని చెప్పబడినది.

''సర్వదేవ నమస్కారాః కేశవం ప్రతి గచ్ఛతి.''

శ్లో|| స ఏవ దేవతా లింగై ర్నామరూప వికల్పితైః

ఇజ్యతే భగవాన్‌ పుమ్భిః స్త్రీ భిశ్చ పతిరూప ధృక్‌

నామరూప భేదములుగల వేరువేరు దేవతలు ఆ పరమాత్మయే. ఏ దేవత నుపాసించినను అతనిని ఉపాసించినట్లే యగును. అట్లే స్త్రీలకు భగవంతుడు పతిరూపము ధరించెను. స్త్రీ లు పతినే ఉపాసింతురు. సంస్కృత- భాగవతము 6-18-34

శ్లో|| యః ప్రాకృతైః జ్ఞాన పధైర్జనానామ్‌

యధాశయం దేహగతో విభాతి

యథానిలః పార్థివ మాశ్రితో గుణం

స ఈశ్వరోమే కురుతా న్మనోరథమ్‌,

సంస్కృత భాగవతము 6-4-34

వాయువు సుగంధమును గ్రహించి మంచి వాసన కలిగినదై అట్లే యున్నదని చెప్పినను దానికి స్వయముగా గంధము లేదు. లోకులు భిన్న భిన్న దేవతల నుపాసింతురు. నీవు వారిహృదయముల యందుండి వారి భావనల అనుసారము భిన్న దేవతా రూపముల వర్తింతువు.

ఉ|| చక్కెరమాని వేము దినజాలని కై వడి మానవాధముల్‌

పెక్కురు బక్కదైవముల వేమరు గొల్చెద రట్ల కాదయా

మ్రొక్కిన నీకె మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవ ఈవలెన్‌

తక్కినమాట లేమిటికి దాశరథీః కరుణాపయోనిథీ!

- దాశరథీ శతకము

అను గోపన్న మాటలలో శ్రీరాముని గుణాతీతుడైన పరమాత్మగా భావించి కొలిచిన మోక్షము లభించుననియు గుణమయులైన దేవతలను గొలిచినచో ఐహికఫలములే లభించుననియు భావము.

రామ రహస్యోపనిషత్తున హనుమంతుడు శ్రీరాముని మోక్షము కొరకై ప్రార్థింపవలయు ననియు, ఐహికములైన వాంఛలకు హనుమంతుని ప్రార్థింపవలెననియు, తెల్పెను.

ఐహికేషు చ కార్యేషు మహాపత్సు చ సర్వదా

నైవ యోజ్యో రామ మంత్రః కేవలం మోక్ష సాధకః

ఐహికే స మనుప్రాప్తే మాంస్మరే ద్రామ సేవకమ్‌

రామ రహస్యోపనిషత్తు

''ఆత్మా వారే మంతవ్యో ద్రష్టవ్యో నిధి ద్యాసితవ్య||''

అను వేదవచనము ఆత్మయే చూడదగినది. ధ్యానింపదగినది పొందదగినది అని తెల్పుచున్నది. అట్లే భాగవతము శ్రీకృష్ణుని పరమాత్మగా భావించి అతడే పొందదగినవాడు, ధ్యానింపదగినవాడనియు తెలుపుచున్నది. వేదము ఉపనిషత్తులు నిర్గుణుడగు పరమాత్మను గూర్చి తెలుపగా సగుణుడైన శ్రీకృష్ణుని పరబ్రహ్మముగా భాగవతము తెలిపెను.

అందులకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన భక్తులకు ''మచ్ఛిత్తః, మయ్యావేశిత మనః. మద్గత ప్రాణాః, మత్పరమః ఆత్మానాం మత్పరాయణమ్‌, మత్కర్మకృత్‌, మద్భక్తః, మద్గతే నాంతరాత్మనా, మన్మనాభవ, మద్యాజీ, మాం నమస్కురు, మయ్యేవ మన ఆధత్స్వ, మయి బుద్ధిం నివేశయ, మద్వ్యపాశ్రయ తద్బుద్ధయ, స్తదాత్మానః, తన్మిష్ఠా, తత్సరాయణః'' అని ఇత్యాది వాక్యములచే తన్నే ప్రార్థించుమని కోరెను. ఇదిగాక ''క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేత సామ్‌'' అని శ్రీకృష్ణుడు అవ్యక్తమును ధ్యానించుట కష్టతరమనియు సగుణారాధన సులభ సాధ్యమని చెప్పెను. ఎట్లయినను రెండు విధానములు పరమాత్మ వైపునకు మనస్సును త్రిప్పుమని బోధించుచున్నవి. భాగవతమున ఈ విషయమునే ''నిర్గణంబును నిరుపాదికంబును అయిన జ్ఞానంబు హరిభక్తి లేకున్న శోభితంగా''దని కపిలుడు వచించెను. ''ఏత దాలంబినం శ్రేష్ఠ మేతదాలంబనమ్‌ పరమ్‌'' అనుట చేత ఉపాసకుని ఆలంబనమునకై సగుణమూర్తి కల్పన చేయబడెను.

శ్లో || చిన్మయస్య అద్వితీయస్య నిర్గుణస్య అశరీరిణః

ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా.

- రామతాపిని ఉపనిషత్తు

చిన్మయుడు, రెండవది లేనివాడు, నిర్గుణుడు, శరీరము లేనివాడు అగు పరబ్రహ్మమునకు ఉపాసకుని భావనకొరకు రూపకల్పన చేయబడినది. రూపములేనిదే ఇంద్రియ గోచరముకాదు; మనోవగతము కాదు. వేదమునందును సగుణ నిర్గుణ ఉపాసన చెప్పబడినది.

''దేవానో బ్రహ్మణోరూపే మూర్తంచై వా మూర్తంచ''

''ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే''

ఇంద్రుడు మాయచే పృధివిలో అవతరించును.

కాని భక్తునకు తానుపాసించు దైవముయొక్క సర్వాత్మభావన తెలియజెప్పుటకై ప్రతి దేవతా కల్పమునందును ''హృదయము'' చెప్పబడియుండును. ''జపాదౌహృదయం'' ఉపాసకుడు జపమునకుముందు హృదయమును పఠించి తా నుపాసించు దైవమే సర్వదేవతా మయ మని భావింపవలెను. ఉదాహరణమునకు దక్షిణామూర్తి కల్పములో బ్రహ్మదేవుడు నారదునకు దక్షిణామూర్తి హృదయ స్వరూపమును ఇట్లు తెలిపెను.

''అహం దక్షిణభాగః విష్ణు స్సవ్యభాగః మధ్యమో రుద్రః త్రిమూర్తి స్సంపృక్తో దక్షిణామూర్తిః అథ త్రిమూర్తయః సాత్విక రాజసిక తామసిక గుణాః అహం రజః సాత్వికో విష్ణుః తమోరుద్రః ఉమాశక్తి రూపం, బ్రహ్మ విష్ణు రుద్రాత్మకో దక్షిణామూర్తిః''

కాబట్టి త్రిగుణమయుడు, త్రిగుణాత్మకుడు, త్రిగుణాతీతుడే దక్షిణామూర్తి యను పరతత్త్వము. అనగా సగుణ నిర్గుణుడు. వ్యక్తా వ్యక్తుడు.

అట్లే నృసింహ సహస్రనామములో శ్రీ నృసింహాకారమున పరికింపుడు

''ఆనాభే ర్బ్రహ్మణో రూప మాగళా ద్వైష్ణవం వపుః

ఆశీర్షా ద్రుద్ర మీశానం తదగ్రే సర్వత్ర శ్శివమ్‌.''

కావున శ్రీ నృసింహస్వామియు పరబ్రహ్మమే.

శ్లో|| అచింత్యాః ఖలు యేభావాః నతాం తర్కేణ సాధయేత్‌

ప్రకృతిభ్యః పరం యత్తు తద చింత్యస్య లక్షణమ్‌

వేదాంతసూత్ర భాష్యము

ఇంద్రియాతీతము లగుటచే చింతించుటకు అశక్యములగు పదార్థములు ఒక తర్కము చేతగాని, అనుమానము చేతగాని, నిర్ణయించగూడదు. సర్వసృష్టికిని మూలమగు ప్రకృతికంటే పరముగానున్న ఈ పదార్థము అచింత్యమగును. కార్యకారణములు తెలుపవీలుపడని ఆధ్యాత్మ్యము లేదా పరతత్వము ఇంద్రియాతీతము మానసికతర్కము నకు లొంగదు. అట్టి నిర్గుణ పరమాత్మను భావించుటకు కష్టమగుట చేతమనస్సునకు ఆలంబనముగా సగుణరూపము గ్రహింపబడినది. దీనినే ప్రతీకము, గుర్తు, సంజ్ఞ, సంకేత మనవచ్చును. (symbol) ఉదాహరణమునకు ఓంకారము పరబ్రహ్మము కాదు, పరబ్రహ్మవాచకము.

''తస్య వాచకః ప్రణవః భగవద్గీత 8-13

ఓంకార చింతనము బ్రహ్మజ్ఞానమునకు సాధన మగును. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించి మనసు లగ్నము చేసినను, జ్ఞానో దయమగునని సగుణోపాసనలోని మర్మము, అందులకే శ్రీకృష్ణుడు తన సత్య స్వరూపము అవ్యక్తము అజమునై యున్నదని చెప్పెను.

శ్లో || నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః

మూఢోయం నాభిజానాతి లోకో మా మజ మవ్యయం

భగవద్గీ 7-25

నే నందరకు ప్రకాశించువాడను కాను. నా ఉత్తమ భక్తులకు మాత్రమే గోచరించువాడను. ఈ జగత్తు యోగమాయచే గప్పబడిన నన్ను ఉత్పత్తి వినాశములు లేనివాడ నని తెలిసికొనజాలకున్నది.

అవతార పురుషునే కాక విగ్రహమును దైవముగా భావించవచ్చునా?

సర్వాంతర్యామి నిర్గుణడు అగు ఆదినారాయణుని విగ్రహ రూపమున పూజింపవచ్చునా అనెడి సందేహమునకుకూడ భాగవతము సమాధాన మిచ్చినది. మనము ప్రతినిత్యము దేవతార్చన చేయునపుడు ప్రతిమకు షోడశ ఉపచార రూపమైన అర్చన చేయుచున్నాము. మన లోని ఆత్మను ''ఉచ్ఛ్వాస రూపేణ బహిరాగత్య'' ఊపిరి రూపమున బయటకు రమ్మని కోరుచున్నాము. తరువాత

''స్వామిన్‌ ! సర్వ జగన్నాథ! యావత్పూజావసానకమ్‌

తావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్‌ సన్నిథిం కురు

పూజ ముగియువరకు ప్రీతితో విగ్రహము నందుండి పూజల గ్రహింపుమని ఆవాహనచేసి వేడుకొనుచున్నాను. ప్రాణప్రతిష్ఠ చేసి షోడశ కళామూర్తిని ఆవాహన చేయుచున్నాము. పూజ ముగిసిన తరవాత ఉద్వాసన చెప్పి ఎప్పటిస్థానమును చేరుమని కోరుచున్నాము. అనగా నిర్గుణ పరబ్రహ్మమైన ఆత్మనే విగ్రహమున ఆవాహనము చేయుచున్నాము. మనో విక్షేపమును మాన్పి భగవంతునిపై నిలకడ గానుంచుటకు ఏకాగ్రతసిద్ధించుటకు ప్రతిమ నుపయోగించుచున్నాము. విగ్రహమునే దేవుడని భావించుట లేదు కదా ? కాబట్టి ఈ భావనతో జేసిన విగ్రహారాధన ఆత్మపూజయే కదా?

అట్లే గాయత్రిని ప్రార్థించున్పుడు సంధ్యావందనమున ''గాయత్రీ మా వాహయామి'' అని ఆహ్వానించి అంత్యమున గచ్ఛదేవి యధా సుఖమ్‌'' అని సాగనంపు చున్నాము. విఘ్నేశ్వరుని చవితి నాడు పూజించి ఆవిగ్రహమును నిర్మాల్యమును నదీజలము నందుంచున్నాము. ఇంతకుముందు సూచించినట్లు ''జాయతే లీయతే యత్ర'' అను జల శబ్దార్థము గ్రహించినచో జలమే భగవంతుడు. ఆజలముతో విఘ్నేశ్వరుడు కలిసిపోవుట భగవంతుని తొలిస్థానమును చేరుటకు సంకేతమని భావించవచ్చును.

అట్లే శ్రీరాముడు కూడ సరయూ నదీజలము ప్రవేశించి ఆవతారము చాలించెను

నిర్గుణ బ్రహ్మాధ్యానము మనస్సున కేకాగ్రత సిద్ధించిన తర్వాత గాని సాధ్యము కాదు. అటు తరువాత స్వస్వరూపాన సంధానము మొదలగును, అంతవరకు ఇంద్రియములద్వారా మనస్సు నామరూపాత్మకమై త్రిగుణాత్మకమైన ప్రపంచముపై ప్రసరించుచునే యుండును నిర్గుణము నిరూపాధికము అగు జ్ఞానము తొలుతనే సిద్ధించదు.

భాగవతమున కూడ ప్రతిమను దైవముగా భావించరాదని కపిల దేవహుతి సంవాదమున తెలుపబడినది.

చ|| అనిశము సర్వభూత హృదయాంతర వర్తి యనం దనర్చు నీ

శు నను నవజ్ఞసేసి. మనుజుండొగి మత్ప్రతిమార్చనా విడం

బనమున మూఢుడై యుచిత భక్తిని భజింపడేని, ఆ

మనుజుడు భస్మకుండమున మానక వ్రేల్చిన యట్టి వాడగున్‌.

భాగవతము 3-964

సర్వహృదయాంతర వర్తియగు భగవంతుని నుద్దేశింపక ప్రతిమనే దైవముగా భావించి పూజించిన ఆ పూజ నిరర్థకమగును. కావున పూజ సమయమున ప్రతిమయొక్క అవశ్యకత విశదమైనది కదా?

ఇంకను కేనోపనిషత్తు పరికింపుడు.

యన్మనా నమతే యే నాహు ర్మనో రుతమ్‌

తదేవ బ్రహ్మ త్వం విద్ధిం నేదం యదిద ముపాసతే||

- కేనోపనిషత్తు

మనస్సుచే ఏది తలచుకొనుటకు సాధ్యముకాదో, మన స్సెవరి మననశక్తి కధీనముగానుండునో, అది సత్యమైనబ్రహ్మమని తెలిసికొనుము. దేనిని ప్రతీకమని ఉపాసించుచున్నావో అది బ్రహ్మము కాదు.

సగుణ బ్రహ్మమును ప్రేమించుట అను ద్వైతముతో భక్తి ప్రారంభ##మై ఏకత్వముతో అద్వైతముతో సమాప్తమగుచున్నది. మనస్సు నిరాకార నిర్గుణములయందు తొలుత లగ్నముకాదు. సాకారముననే లగ్నమగుచున్నది. ఏకాగ్రత అమనస్కము సిద్ధించిన తరువాతనే ఆత్మసాక్షాత్కారము కలుగును. ప్రారంభములో భక్తి, ఉపాసన ఒక్కటియే, బాహ్య పదార్థములను బ్రహ్మభావనతో చింతించుటయే ప్రతీకోపాసన. పదార్థదృష్టి తొలగించిన అది అహంగ్రహోపాసన యగును. అనగా నిజరూపమును బ్రహ్మముగా భావించి చింతించుట లేక సస్వరూపానుసంధానము అనవవచ్చును. కాన సగుణోపాసన సాధనము నిర్గుణోపాసనసాధ్యము.

ప్రతిమార్చన ఎప్పుడు మొదలైనది?

దీనికి భాగవత సమాధానమును గమనింపుడు,

''పరస్పర పాత్రంబులకు సహింపని మనుషులకు బూజనార్థంబుగా ద్రేతాయుగమునందు, హరి ప్రతిమలు గల్పింపబడియే. కొందరు ప్రతిమార్చనంబు నేయుదురు. పాత్రపురుష ద్వేషులైనవారలకు నట్టి ప్రతిమార్చనంబు ముఖ్యార్థప్రదంబు గాదు. మందాధికారులకు ప్రతిమార్చనంబు పురుషార్థప్రదమగును. భాగవతము 7-453

పూర్వము యోగి యగు బ్రాహ్మణుని పాత్రముగా భావించి అగ్రస్థానమిచ్చి పూజించెడివారు. తరువాత మానవులు తమకే పూజార్హత అగ్రస్థానముకలదని పరస్పరము వాదులాడగా త్రేతాయుగమున హరిప్రతిమలు కల్పింపబడెను. పాత్ర నిర్ణయ నిపుణులగు విద్వాంసులు హరియే ముఖ్యపాత్రమని పలుకుదురు.

ప్రతిమార్చనా విధానము :

భాగవతమున ఏకాదశస్కంధమున క్రియా యోగమునందు ప్రతిమార్చన విధానము చెప్పబడినది. భక్తితోను శ్రద్ధతోను ఈ అర్చన చేయవలయును.

శ్లో|| అర్చాయాం స్థండిలేగ్నే వా సూర్యేవాప్సు హృదిద్విజే

ద్రవ్యేణ భక్తియుక్తోర్చేత్‌ స్వగురుం మా మమాయయా

సంస్కృత భాగవతము 11-27-9

ప్రతిమ, చక్రాబ్జ మండలము, అగ్ని, సూర్యుడు, జలము, తన హృదయము, బ్రాహ్మడు వీనిలో నెదేనొకదాని యందు పూజాసాధనములతో తన గురువునగు నన్ను నిష్కపట భావముతో భక్తియుక్తుడై పూజించవలెను.

అర్చనకు వైదిక తాంత్రిక లేదా మిశ్రమ పద్ధతులలో దేనినైన అవలంబించవచ్చును.

శ్లో|| వైదిక స్తాంత్రికో మిశ్ర ఇతి మే త్రివిధోమఖః

త్రయాణా మీప్సితేనైవ మాం సమర్చయేత్‌.

సంస్కృత భాగవతము 11-27-7

నా పూజ వైదికము, తాంత్రికము, మిశ్రమము అని మూడు విధములు. ఇందు తమకిష్టమగు పద్ధతిద్వారా నన్ను పూజించవచ్చును. విగ్రహమును శిల, లోహము మొదలగువానిచే చేయవచ్చును.

శ్లో|| శైలీ దారుమయీ లోహీ లేప్యా లేఖ్యాచ సైకతీ

మనోమయీ మణిమయీ ప్రతిమాష్ఠ విధాస్మృతా||

ప్రతిమ శిలామయము, లోహమయము, మృణ్మయము లేదా చందనాది మయము, లేఖ్యము, సికతామయము, మానసపూజ చేయుచో మనోరూపము, మణిమయము అని ఎనిమిది విధములు. కోరికలు లేక ఆర్చించిననే భక్తి యోగము సిద్ధించును.

శ్లో|| మామేవ నైర పేక్ష్యేణ భక్తి యోగేన విందతి

భక్తి యోగం నలభ##తే ఏవం యః పూజయేత మామ్‌||

ఈ విధముగా ఎవడు ఫలాభిసంధి లేని భక్తి యోగముతో నన్నారాధించునో వాడు నన్నే చేరును. అతడు భక్తియోగము నందును.

భగవంతుని సగుణ నిర్గుణ లక్షణములు :

భగవంతుడు నిర్గుణు డైనప్పటికిని ''ఉపాసకానాం కార్యర్థం బ్రహ్మణో రూపకల్పన'' అని రామతాపినిలో చెప్పినట్లు సగుణుడు గా చిత్రింపబడెను. భాగవతములో భగవంతుడు నిర్గుణుడయ్యును. భక్తులకొరకై సగుణ డయ్యెనని చెప్పబడినది. భగవంతు డవతరించుట యనగా దిగి వచ్చుట. సగుణమే తుదకు నిర్గుణమునకు దారి తీయును. సగుణరూపుడైన పరమాత్మనే మనము నిర్గుణ విశేషణము లచే స్తుతించుచున్నాము.

సచ్చిదానందరూపుడు, అవ్యయుడు, నిర్విశేషుడు, నిరంజనుడు, విశ్వరూపుడు, అనంతుడు, సర్వాత్మ, అప్రమేయుడు, అవ్యక్తుడు, అజుడు, నిర్వికారుడు, సర్వజ్ఞుడు, అఖండుడు, నిర్గుణుడు, మనస్సునకు ఇంద్రియములకు పరుడు, కేవల అనుభవానంద స్వరూపుడు, నిరాకారుడు, అచలుడు, అప్రమేయుడు, అక్రియుడు, మొదలగు నామ ములచే భగవంతుని నుతింతురు.

భగవంతుని సగుణరూపము లనేకములు. దివ్యములు, ఆతని క్రియలు లీలలు. భగవద్గీతలో ఆతని మహిమలు విభూతులు విభూతి యోగమున చెప్పబడినవి. సగుణుడుగా చూచినప్పుడు శ్రీకృష్ణుడే భగవంతుడు.

శ్లో|| ఏషవె భగవాన్‌ సాక్షాత్‌ ఆద్యోనారాయణః పుమాన్‌

మోహయన్‌ మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు||

సంస్కృత - భాగవతము 1-9-18

శ్రీకృష్ణుడే సాక్షాత్‌ భగవంతుడు. అదికారుణుడు, పరమపురుషుడైన నారాయణుడు. తన మాయచే లోకులను మోహింపజేసి యాదవులతో కలిసి తిరుగుచు లీల జేయుచున్నాడు.

శ్రీ కృష్ణోపనిషత్తులో శ్రీకృష్ణుని నామరూప క్రియలచేత సగుణ మూర్తిగా చిత్రింపలేదు. అతడే పరతత్త్వమని తెలుపుటకు ఆ యా నామములు సూచించు సంకేతార్థములను వివరించెను.

''యో నందో పరమానందః''

అందులకే కాబోలు శ్రీకృష్ణుని పోతన తొలి పద్యములోనే ''ఆనందాంగనా డింభకున్‌'' అని సూచించెను. ఇంకను

''యశోదా ముక్తి గేహినీ'' '' వంశస్తు భగవాన్‌ రుద్రః''

''దయాసా రోహిణీమాతా'' ''సత్యభామా ధరేతివై''

ఇత్యాది వాక్యములచే భాగవత సాంకేతిక స్వరూపము వివరించబడినది. శ్రీకృష్ణుని లీలలకుకూడ అనేక అంతరార్థములు వివరింపబడినవి. అతడు లీలామానుష విగ్రహుడు. అనేక అవతారములను దాల్చి దుష్టశిక్షణ శిష్టరక్షణ జరిపెను. దశావతారములు ముఖ్యములైనను కపిలాది ఇతర అవతారములు కూడ భాగవతమున పేర్కొనబడినవి. ఉత్తమాధికారులకు భగవంతుడు నిర్గుణుడు, మధ్యమాధికారులకు, అతడు తల్లి, తండ్రి. గురువు, దైవము, సకలము.

శ్లో|| మాతా నృసింహశ్చ పితా నృసింహః

భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః

విద్యా నృసింహో ద్రవిణం నృసింహః

స్వామీ నృసింహః సకలం నృసింహః

మందాధికారులకు భగవంతుడు అమోఘ లీలలనొనర్చు మానవ రూపధారి. సామాన్యులకు ఇట్టి దేవతామూర్తి యే సుగమము. భగవంతు డనేక రూపములతో కూడ అవతరించును.

శ్లో|| యోనః సపత్నైః భృశ మర్ద్యమానాన్‌

దేవర్షి తిర్యక్‌ వృషు నిత్యఏవ

కృతావతార స్తమభిః స్వమాయయా

కృత్వా ೭೭ త్మసాత్‌ పాతి యుగేయుగేచ

భాగవతము 6-9-26

దేవతలు శత్రువులచేత పీడింపబడునప్పుడు, తాను నిర్వికారుడై నప్పటికి, మాయను ఆశ్రయించినవాడై దేవత, ఋషి,పశు, పక్షి మనుష్యరూపమునవతరించి యుగయుగమున మనలను రక్షించుచున్నాడు.

భగవంతు డేపనియైనను చేయగల శక్తి మంతుడు.

శ్లో|| తేషా మంతర్దధే రాజన్‌ స్వచ్ఛందగతిరీశ్వరః

ఈశ్వరు డంతర్ధానము నొందెను. అతడు సర్వశక్తిమంతుడు. పరమ స్వతంత్రుడు, అతని లీలారహస్యము నెవడెరుగును?

భాగవతము 8-6-26

భగవత్‌ శబ్దార్థమును గూర్చి విచారింతము.

''భగమన కీర్తి, వీర్యమును, భాగ్యము, ధర్మము, జ్ఞానమోక్షముల్‌, అనుటచేత భగవంతుడు పై లక్షణములు కలవాడని చెప్పవచ్చును. భాగవత మిట్లు తెలుపుచున్నది.

క|| అగుణుండగు పరమేశుడు

జగముల గల్పించుకొరకు జతురత మాయ

సగుణండగు గావున హరి

భగవంతుడనగ బరగె భవ్యచరిత్రా!

భాగవతము 2-100

భగవంతుని లీలలు మాహాత్మ్యము తెలుపు కథలు అనేకములు భాగవతమున కలవు.

1) శ్రీకృష్ణుడే సృష్టికర్త:

ఒకప్పుడు బ్రహ్మ శ్రీకృష్ణుని పరీక్షింప దలచెను. గోవులను గోపకులను ఒక గుహలో దాచెను. శ్రీకృష్ణు డిది గ్రహించి గోవుల రూపములను గోపాలుర రూపములను తానే దాల్చి వ్రేపల్లేకు పోయెను. బ్రహ్మ కొన్ని సంవత్సరముల తరువాత తిరిగివచ్చి చూచెను. తాను గుహలో దాచిన గోవులు గోపాలురు అట్లే ఉండగా శ్రీకృష్ణుడే వారి రూపములను ధరించి సంచరించు చుండుట గమనించెను.

మత్త. బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడున్‌

బ్రహ్మ నొక్కడ గాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా

బ్రహ్మ నేను సృజింప నొండొక బాలవత్స కదంబమే

బ్రహ్మ మందు జనించె నొక్కట బ్రహ్మమౌ నది చూడగా

భాగవతము 10-530

అని బ్రహ్మ ఆశ్చర్యపడెను. తానే సృష్టికర్త యను గర్వము నశించగా బ్రహ్మ బాలగోపాల బ్రహ్మమును శరణువేడెను.

2) సత్యభామకు శక్తి నొసగుట:

ఈవిషయమును నరకాసుర వధయందు పూర్తిగావివరించితిని.

3) గోవర్ధనగిరి ఎత్తుట:

గోపాలురు, నందుడు ఇంద్రయాగము సేయ సమకట్టిరి. ఇంద్రుని తృప్తి పరచిన మేఘములచే వర్షము గురిపించునవి వారు భావించిరి. దానితో సస్యములు పండును. ధర్మార్థ కామములు సిద్ధించును. కాని శ్రీకృష్ణడు ''వారికి పూర్వకర్మవలన సుఖ దుఃఖంబులు కల్గును. సత్వ రజస్తమోగుణములు ఉత్పత్తి స్థితి. లయములకు కారణములు. రజమున జగము జన్మించి రజోగుణ ప్రేరితములై మేఘములు వర్షించును. ఇంద్రుడేమియు చేయజాల''డని తెలిపెను. పసులకు కొండకు, బ్రహ్మణోత్తములకు మఖము గావింపుడని తెలిపెను. నందాదు లట్లే యొనర్చి తృప్తిని జెందిరి. కాని ఇంద్రుడు కోపించి రాళ్ళ వాన గురిపించెను. వరాహావతారము నెత్తి భూమినే పై కెత్త గల్గిన శ్రీహరి గోవర్థన పర్వతము నవలీలగా నెత్తి గోవులను గోపకులను దాని క్రిందకు పిలిచి వారిని రక్షించెను.

శా|| బాలుం డీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా

జాలండోయని దీని క్రిందనిలువన్‌ శంకింపగా బోల ది

శై లాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై బడ్డ నా

కే లల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్‌ బ్రమోదంబునన్‌.

భాగవతము 10-919

ఏడు దినములు ఇంద్రుడు రాళ్ళవాన గురిపించి తుదకు ఓడిపోయి వెడలిపోయేను.

ఋగ్వేదమున ఇంద్రుడే పరమాత్మగా చెప్పబడెనని. కాని ఆ ఇంద్రుడే భాగవతమున శ్రీకృష్ణపరమాత్మగా చిత్రింపబడెను. సంకేత రూపమున భారతయుద్ధము వేదమున కలదని శ్రీవాశిష్ఠ గణపతిముని నిరూపించెను.

పై కథలు భగవంతుడైన శ్రీకృష్ణుడే సర్వశక్తిమంతుడని నిరూపించుచున్నవి. శ్రీకృష్ణుడు లీలమానుష విగ్రహుడు. అతడు లీలలమోఘములు. అతడాశ్రిత కల్ప తరువు. భూరికృపా సాగరుడు. ప్రణతార్తిహరుడు, దీనావనుడు. ఇట్టి లీలలను తెలుపు కధలను వినిన భక్తులకు శ్రీకృష్ణుడే తమ్ము తరింపజేయువాడనియు, ఇహపర సౌఖ్యముల నివ్వగలడనియు, నమ్మకము చేకూరును. అట్టి లీలలను వినుట వలన, చదువుటవలన మనస్సు పరమాత్మయందు లగ్నమగును. దానిచే మోక్షము లభించును. అతడు పరమాత్మయందు లగ్నమగును దానిచే మోక్షము లభించును. అతడు భక్తి సులభుడు, జ్ఞానార్జనము కంటెను, సన్యాసము స్వీకరించుట కంటెను భక్తి నవలంభించుటయే శ్రేయస్కరము.

శ్లో || స్వప్నోపమ మముం లోక మసన్తం శ్రవణ ప్రియం

ఆశిషో హృది సంకల్ప్య త్యజ న్త్యర్థాన్‌ యధా వణీక్‌.

భాగవతము 11-21-31

స్వర్గాది పరలోకములు స్వప్నసమానములు. అవి అసత్యములు వాని విషయమైన భావనలు తీపిగా నుండును. సకాముడైన పురుషుడు స్వర్గభాగములను మనస్సులో భావించును. వ్యాపారి అధికలాభమును పొందగోరి మూలధనమునుకూడ పోగొట్టుకొన్నట్లు, సకామయజ్ఞముల ద్వారా ధనమును నాశనము చేయుచున్నారు.

భగవంతుడగు శ్రీకృష్ణుడు ప్రకృతి నియమముల నుల్లంఘించి పంచభూతముల జయించెననుటకు భాగవతమున కథలు చెప్పబడినవి.

పృథివీ జయము :

పట్టిన పట్టువీడని శ్రీకృష్ణుని యశోద రోటికి బంధింపబూనెను. శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి కౌగిటిలో చిక్కలేదు. సనకాది యోగి చిత్తాబ్జ మలలో చిక్కలేదు. అట్టివాడు యశోద త్రాడుతో బంధింపబూనిన చిక్కునా? యశోద త్రాడుతో అతనిని కట్ట బ్రయత్నించినపుడు అతని ఉదరము పెరుగజొచ్చెను. ఎంతటి పొడవుగల త్రాడు నుపయోగించి నను చాలుటలేదు. తుద కామె అలిసిపోయెను. ''జగజ్జాలము లున్న బొజ్జ గట్టన్‌ వశ##మే? తల్లియని కరుణించి బంధ విమోచనుడైన శ్రీకృష్ణుడు రోటికి త్రాడుతో తుదకు బంధింపబడెను. ఆచట నల కూబర మణిగ్రీవులను ఇద్దరు గంధర్వులు నారద శాపవశమున మద్ది వృక్షములై యుండిరి. వారి శాపములను బాపుటకై గోపాలకృష్ణుడు రోలు నీడ్చుకొనుచు వచ్చి మద్దివృక్షముల బడద్రోసి వారి శాపముల బాపెను. ఈ కథ శ్రీకృష్ణుడు పృథివీతత్త్వమును జయించెను. అని సూచించెను.

2) జలతత్వమును జయించుట :

నందుని వరుణ లోకమునుండి గొని తెచ్చుట;

ఏకాదశినాడు నందు డుపవాసము చేసి హరిపూజ చేసి తెల్లవారకనే ద్వాదశీ స్నానము చేయుటకై యమునానదిని ప్రవేశించెను. వరుణదూత యొకడు నందుని వరుణనగరమునకు గొనిపోయెను. నందుడు లేకుండట గోపకులవలన విని శ్రీకృష్ణుడు వరుణలోకమునకు జనెను. వరుణుడు తన బంటు చేసిన తప్పు మన్నింపుమని ప్రార్థించి నందుని విడచెను.

ఈకథ శ్రీకృష్ణుడు జలతత్త్వమును జయించెనని సూచించును. ఇంకను సాందీపుని కుమారుని సముద్రమునుండి గొనితెచ్చు కథయు కలదు.

3) కార్చిచ్చు నార్పుట :

బకవనమునందు దైవయోగమున దావాగ్ని జనించెను. ఆ కార్చిచ్చు నుండి రక్షింపుమని గోపకులు శ్రీకృష్ణుని వేడుకొనిరి. శ్రీ కృష్ణుడు వారిని కన్నులు మూసికొనుడని దావాగ్నిని మ్రింగెను.

క|| కార్చి చ్చార్పు పటుత్వము

నేర్చునే నరుడొకడు శౌరి నేడిదె కార్చి

చ్చార్చి మనల రక్షింపగ

నేర్చె నిత డజుడో హరియొ నిటలాక్షుండో

భాగవతము 10-748

ఈ కథ శ్రీకృష్ణు డగ్నిని జయించుట నిరూపించును.

4) తృణావర్తుని జంపుట :

సుడిగాలియై తృణావర్తుడను రాక్షసుడు శ్రీకృష్ణుని గొనిపోయెను. పోనుపోను అతనికి శ్రీకృష్ణుడు భారమైతోచెను. శ్రీకృష్ణు డతని మెడబట్టి వ్రేలాడగా రాక్షసుడు క్రిందబడి మరణించెను.

ఈ కథవలన కృష్ణుడు గాలిని జయించెనని తెలియుచున్నది.

5) మృద్భక్షణము :

గోపాలురు ''శ్రీకృష్ణుడు మన్నుతినెనని'' యశోదతో చెప్పిరి. యశోద ''మన్నేటికి భక్షించెదు? మన్నియమములేల నీవు మన్నింపవని '' దండించెను. దానికి బదులుగా శ్రీకృష్ణుడు

శా|| అమ్మా! మన్నుదినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్ఱినో

నమ్మం జూడకు వీరి మాటలు మదిన్‌, నన్నీవు గొట్టంగ వీ

రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్‌ మదీయాస్య గం

ధ మ్మాఘ్రాణము నేసి నావచనముల్‌ దపై#్పవ దండింపవే.

భాగవతము 10-338

శ్రీకృష్ణుడు నోరు దెరచి చూపగా అందులోన

క|| ఆలలితాంగి గనుంగొనె

బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ

గోళ శిఖి తరణి శశి ది

క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్‌ . భాగవతము 10-340

అప్పుడు యశోద

మ|| కలయో, వైష్ణవమాయయో, యితర సంకల్పార్థమో, సత్యమో

తలపన్‌ నేరక యున్నదాననొ, యశోదాదేవిగానో, పర

స్థలమో, బాలకు డెంత యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర

జ్వలమై యుండుట కేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్‌

భాగవతము 10-342

ఆ|| బాలమాత్రు డగు సలీలుని ముఖమందు

విశ్వమెల్ల నెట్లు వెలసి యుండు

బాలుభంగి నితడు భాసిల్లుగాని స

ర్వాత్ము డాదివిష్ణు డగుట నిజము భాగవతము 10-343

అని నిశ్చయించెను. ఈకథ సర్వాంతర్యామిత్వము ఆకాశజయమును సూచించును.

పైవిధముగా భాగవత భగవద్గీతల యందు సగుణ నిర్గుణ తత్త్వములు రెండును వివరింపబడెను. ''ఏకం సత్‌ విప్రాబహుభా వదంతి'' అను వచనానుసారము ఏకేశ్వరుడు ప్రతిపాదింపబడెను. సగుణ భావనయే నిర్గుణమునకు దారితీయును. సగుణు డైనప్పుడు నామ రూప క్రియలు వర్ణింపబడెను. భక్తరక్షణకై భగవంతు డవతరించెను. ఏకేశ్వరుడు లౌకికదృష్టితో సగుణడు పారమార్థిక దృష్టితో నిర్గుణుడని సారాంశము. దేవతలందరు నారాయణమూర్తి అంశ##లే (unityin diversity). ఇట్లు అనేకత్వములో ఏకత్వము ప్రతిపాదింపబడినది. ఏకేశ్వరోపాసన నిర్ణయింపబడినది.

తే. మాయచేత నెఱుక మాలిన వారలు

బెక్కుగతుల నిన్ను బేరుకొందు

రెఱుగ నేర్చు విబుధు లేకచిత్తంబున

నిఖిల మూర్తులెల్ల నీవయండ్రు భాగవతము 10-89

Sri Bhagavadgeetha Madanam-1    Chapters